దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో పెరుగుతున్న హింస
న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో పెరుగుతున్న హింస, విధ్వంసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం తీవ్రస్థాయి చర్యలు ప్రతిపాదిస్తోంది.
ఆస్పత్రుల్లో ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది లేక ఏ ఇతర విభాగ సిబ్బందిపైనైనా దాడిచేసిన వారు ఇక కఠిన దండన ఎదుర్కోవాల్సి ఉంటుంది.
వైద్యుల మీదో, వైద్యం మీదో కోపంతో విధ్వంసానికి తెగబడినా కఠిన శిక్ష తప్పదు.
హింస, విధ్వంసాలను రెచ్చగొట్టినా జైలు తప్పదు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం తేనుంది.
30 రోజులలోపు ప్రజల అభిప్రాయాలు తెలపాలంటూ బిల్లు ముసాయిదాను ఆన్లైన్లో ఉంచింది. ఈ బిల్లు ప్రకారం..
ఓ డాక్టరు లేదా నర్సు లేదా ఇతర వైద్య సిబ్బందిని కొడితే కనీసం ఆరు నెలల జైలు శిక్ష
గాయపరిచినా, హింసించినా- దాని స్థాయిని బట్టి మూడేళ్ల నుంచి ఐదేళ్ల దాకా ఖైదు తప్పదు.
కేవలం జైలే కాదు... కనీసం రూ 5వేల నుంచి రూ 5 లక్షల దాకా జరిమానా కూడా విధించవచ్చు
వైకల్యం లేదా కోలుకోలేని స్థితి తెచ్చినా, లేక చంపేసినా 10 సంవత్సరాల కఠిన కారాగారవాసం.
కేసు తీవ్రతను బట్టి రూ 10 లక్షల దాకా జరిమానా విధించవచ్చు
నేర శిక్షాస్మృతితో సంబంధం లేకుండా కేవలం ఓ చిన్న కాగితం మీద బాధితులు ఫిర్యాదు చేసినా కేసు నమోదు
సీఆర్పీసీతో సంబంధం లేకుండా ఎకాయెకిన అరెస్టు చేయవచ్చు, చేసిన నేరానికి బెయిల్ కూడా ఇవ్వరు
డీఎస్పీ ర్యాంకు అధికారి కేసు నమోదు, దర్యాప్తు చేపట్టాలి.
ఆస్తినష్టానికి తెగబడితే మార్కెట్ విలువకు రెండు రెట్లు జరిమానాగా కట్టాలి లేదా కోర్టు నిర్దేశించిన ప్రకారం పరిహారం చెల్లించాలి
వైద్య సిబ్బందిని మామూలుగా గాయపరిస్తే అతనికి లేదా ఆమెకు రూ లక్ష పరిహారం తీవ్రంగా గాయపరిస్తే రూ 5 లక్షల దాకా పరిహారం చెల్లించాలి
దాడి చేసిన వారు పరిహారాన్ని చెల్లించకపోతే.. రెవెన్యూ చట్టం కింద భూమి లేదా స్ధిరాస్తుల నుంచి వసూలు
Comments
Post a Comment