శబరిమలలో మండల పూజ ప్రారంభం సందర్భంగా ఈ నెల 16వతేదీ నుంచి ఆలయం తెరుస్తున్న కేరళ ప్రభుత్వం
తిరువనంతపురం (కేరళ):
కేరళ రాష్ట్రంలోని శబరిమలలో మండల పూజ ప్రారంభం సందర్భంగా ఈ నెల 16వతేదీ నుంచి ఆలయం తెరుస్తున్న నేపథ్యంలో కేరళ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలని సుప్రీంకోర్టు గత ఏడాది సెప్టెంబర్ 28 న తీర్పు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో కొందరు మహిళలు అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు యత్నించగా భక్తులు అడ్డుకున్నారు. ఆ సందర్భంగా ఆలయంలో పెద్ద వివాదం చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలో మండల పూజ కోసం ఈ నెల 16 వతేదీ నుంచి అయ్యప్ప ఆలయాన్ని తెరుస్తున్న దృష్ట్యా కేరళ పోలీసులు పదివేలమందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
24 మంది ఎస్పీలు, ఏఎస్పీలు, 112 మంది డీఎస్పీలు,264 మంది ఇన్స్పెక్టర్లు, 1185 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 8,402 మంది సివిల్ పోలీసులు, 307 మంది మహిళా పోలీసులను అయ్యప్ప దేవాలయ కాంప్లెక్స్ వద్ద బందోబస్తు కోసం నియమించారు.
కాగా శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అధిగమించడానికి చట్టాలు రూపొందించడం సాధ్యం కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు.
మొత్తంమీద భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈ ఏడాది అయ్యప్పస్వామి దేవాలయంలో మండల పూజ ప్రారంభం కానుంది.
Comments
Post a Comment