భూమా అఖిలప్రియపై కోర్టుకెక్కిన తమ్ముడు
భూమా అఖిలప్రియపై కోర్టుకెక్కిన తమ్ముడు
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మరోసారి చిక్కుల్లో పడ్డారు. కుటుంబ సభ్యులు, బంధువులెవరితోనూ ఆమెకు పొసగడం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. సొంత తమ్ముడే ఆమెపై రంగారెడ్డి అడిషనల్ కోర్టులో కేసు వేశాడు. ఇద్దరి అక్కగార్ల నుంచి తనకు న్యాయం చేయాలని అఖిలప్రియ సోదరుడు కోర్టు మెట్లు ఎక్కడం సంచలనంగా మారింది. ఈ నెల 14న కోర్టులో కేసు దాఖలు చేశారు. కేసుకు సంబంధించి ప్రతివాదులకు నోటీసులు పంపారు.
ఒకదాని తర్వాత మరొకటి నీడలా ఆమె కుటుంబాన్ని కేసులు వెంటాడుతూ, వేటాడుతున్నాయి. ఆళ్లగడ్డలో క్రషర్ మిషన్కు సంబంధించి భూమా అఖిలప్రియ సమీప బంధువుపై దాడి ఆమె భర్త భార్గవ్రామ్పై కేసు నమోదుకు దారి తీసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ అతను పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నాడు. ఇప్పుడు భూమా అఖిలప్రియ వంతు వచ్చింది.
ఆమెపై కేసు పెట్టింది మరెవరో కాదు....రక్తం పంచుకుని పుట్టిన తమ్ముడు జగత్విఖ్యాత్రెడ్డి కావడం గమనార్హం. అఖిలప్రియపై కేసుకు ఆస్తి తగాదాలే కారణమని తెలుస్తోంది. అక్కా అక్కా అంటూ చెంగు పట్టుకుని తిరుగుతున్న తమ్ముడే...కోర్టుకు లాగడం ఆంధ్రప్రదేశ్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
భూమా నాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం (ఇప్పుడు గండిపేట) మంచిరేవులలో సర్వేనంబర్ 190, 192/A, 92/Bలలో ప్లాట్ నంబర్ 9, ప్లాట్ నంబర్ 20 కింద వెయ్యి గజాల స్థలం ఉండేది. శోభానాగిరెడ్డి 2014లో ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణానంతరం 2016లో ఆ భూమిని భూమా నాగిరెడ్డి దాదాపు రూ.2 కోట్లకు విక్రయించినట్టు సమాచారం. అప్పట్లో భూమా నాగిరెడ్డితో పాటు ఆయన ఇద్దరు కూతుళ్లు అఖిలప్రియారెడ్డి, మౌనికారెడ్డి సంతకాలు చేయగా, తనయుడు జగత్విఖ్యాత్రెడ్డి వేలిముద్ర వేశాడు.
ఇప్పుడు ఆ భూమి విలువ రెట్టింపైంది. భూమిని విక్రయించిన మూడేళ్ల తర్వాత జగత్విఖ్యాత్ కోర్టు మెట్లు ఎక్కాడు. భూమి అమ్మే సమయానికి తాను మైనర్నని, తనకేమీ తెలియని వయస్సులో తండ్రితో పాటు అక్కలిద్దరూ విక్రయించారని, ఇప్పుడు తన వాటా మూడో భాగం తనకు కావాలంటూ న్యాయం కోసం అక్కలైన అఖిలప్రియ, మౌనికలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. అక్కలతో పాటు భూమిని కొనుగోలు చేసిన హైదరాబాద్కు చెందిన ఎస్.సుధాకర్రెడ్డి (రాజేంద్రనగర్), శ్రీమతి హరిత వెంకట చీమల (రాజేంద్రనగర్), సుబ్బరాయప్రపుల్లా చంద్ రేటూరి (హైదరాబాద్), శ్రీమతి ప్రవీణ రంగోల (వెస్ట్గోదావరి), సయ్యద్ఎథెశ్యామ్హుస్సేన్ (మైదరాబాద్)లను కూడా ప్రతివాదులుగా చేర్చాడు.
కోర్టుకెక్కిన జగత్విఖ్యాత్రెడ్డి ప్రతివాదులకు పంపిన నోటీసులో ప్లాట్ నంబర్ 43, ఆపోజిట్ జెహెచ్పిఎస్, రోడ్నంబర్ 71, ఫిల్మ్నగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్ చిరునామాగా పేర్కొన్నాడు. ఇదే చిరునామాతో తన ఇద్దరక్కలకు కూడా నోటీసులు పంపడం గమనార్హం. కోర్టు నోటీసులు అందుకున్న భూమి కొనుగోలుదారులు గగ్గోలు పెడుతున్నారు. సమాజంలో ఎంతో పెద్దమనిషిగా పేరున్న భూమా నాగిరెడ్డి నుంచి తాము భూమి కొన్నామని , ఆయన మరణానంతరం వారి కుమారుడు కోర్టు నోటీసులు పంపడంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిసింది.
కొసమెరుపు
భూమా కుటుంబమంటే ఏమనుకుంటున్నారు? జాగ్రత్త అని భూమా అఖిలప్రియ పదేపదే హెచ్చరిస్తుంటారు. రెండు తెలుగు రాష్ర్టాల్లో తన కుటుంబ పరపతి, పలుకుబడి గురించి ఆమె అనేక సందర్భాల్లో మీడియా సాక్షిగా చెబుతూ ప్రత్యర్థులను తమ విషయంలో జాగ్రత్తగా మలుచుకోవాలని సూచిస్తుంటారు. ఇటీవల అఖిలప్రియ భర్త కోసం హైదరాబాద్లో ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులకు ఆమె చేసిన హెచ్చరికలను సోషల్ మీడియాలో చూసిన వారంతరూ ముక్కున వేలేసుకున్నారు. జగత్విఖ్యాత్రెడ్డి తరపున స్వయాన అఖిల మరిది (భార్గవ్రామ్ తమ్ముడు) శ్రీసాయిచంద్రహాస్ కేసు వేయడం, అక్కాచెల్లెళ్లు, తమ్ముడు ఒకే ఇంట్లో ఉంటూ కూడా కోర్టు మెట్లు ఎక్కడం కొసమెరుపు. జగత్ కోర్టుకెక్కడం వెనుక భూమి కొనుగోలుదారులు అఖిలప్రియపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం
Comments
Post a Comment