టిక్టాకే లోకమైన అక్కాచెల్లెళ్ల వరుసయ్యే ఆ ఇద్దరు యువతులు అక్కడే తమతో పరిచయమైన ఇద్దరు యువకులతో ప్రేమలో పడ్డారు!
టిక్టాకే లోకమైన అక్కాచెల్లెళ్ల వరుసయ్యే ఆ ఇద్దరు యువతులు అక్కడే తమతో పరిచయమైన ఇద్దరు యువకులతో ప్రేమలో పడ్డారు! ‘వచ్చేయండి పెళ్లిచేసుకుందాం’ అని ఆ యువకులు చెప్పడంతో సంబరపడ్డారు. తల్లిదండ్రులు వారించినా, వినకుండా మరీ రైలెక్కారు. తీరా అక్కడికి వెళ్లాక వారు మొహం చాటేయంతో ఇద్దరూ కంగుతిన్నారు! సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసాన్పల్లి గ్రామానికి చెందిన యువతుల కథ ఇది! ఇద్దరూ అన్నాదమ్ముల కూతుళ్లు. తుప్రాన్లోని ఓ వాణిజ్య సముదాయంలో పనిచేస్తున్నారు. ఏపీ అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం దర్గాహోన్నూరు గ్రామానికి చెందిన వంశీ, వన్నూరుస్వామి డిగ్రీ విద్యార్థులు.
ఇద్దరు యువతులకు టిక్టాక్లో ఆర్నెల్ల క్రితం ఈ యువకులు పరిచయమయ్యారు. అది ప్రేమగా మారింది. పెళ్లిచేసుకుందాం.. వచ్చేయండి అంటూ ఆ యువతులకు వంశీ, స్వామి చెప్పారు. తమ ఊరు దాకా ఎలా రావాలో పక్కాగా రూట్మ్యాప్ కూడా ఇచ్చారు. వెంటనే ఆ యువతులు రైలెక్కి దర్గాహోన్నూరుకు చేరుకున్నారు. అయితే అక్కడికి వెళ్లిన వారిని తాము వివాహం చేసుకోలేమని వంశీ, స్వామి వారికి తేల్చిచెప్పారు. దిక్కుతోచనిస్థితిలో ఆ యువతులు అక్కడి గ్రామ పెద్దలను ఆశ్రయించి న్యాయం చేయాలని అర్థించారు. వారు ఎటూ తేల్చకపోవడంతో బొమ్మనహాళ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ యువతులను కళ్యాణదుర్గంలోని ఉజ్వల్ హోమ్కు పోలీసులు తరలించారు. కాగా ఇద్దరు కూడా వారినే పెళ్లి చేసుకుంటామని పట్టుబడుతుండటం విశేషం.
Comments
Post a Comment