ఆర్టీసీ విభజనకు అనుమతి కోరలేదు: కేంద్రం
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో అధికారులు సమర్పించిన అఫిడవిట్లపై హై కోర్టులో విచారణ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ రాజేశ్వరరావు వాదనలు వినిపించారు. ఏపీఎస్ఆర్టీసీ విభజన పూర్తి కాలేదని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. టీఎస్ఆర్టీసీకి చట్టబద్ధత లేదని, అలాంటప్పుడు టీఎస్ఆర్టీసీలో 33 శాతం వాటా ప్రశ్నే తలెత్తదని కేంద్రం కోర్టుకు తెలిపింది. ఏపీఎస్ ఆర్టీసీలోనే 33 శాతం వాటా ఉందని కేంద్రం తెలిపింది. ఏపీఎస్ఆర్టీసీలో కేంద్రానికి ఉన్న వాటా టీఎస్ఆర్టీసీకి బదిలీ కాదని కేంద్రం స్పష్టం చేసింది.
మరోవైపు ఆర్టీసీ పునర్వ్యవస్థీకరణకు తమ అనుమతి కోరలేదని కేంద్రం తెలిపింది. దీనిపై ఏజీ, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పందిస్తూ విభజన చట్టంలోని సెక్షన్3 ప్రకారం టీఎస్ఆర్టీసీ ఏర్పాట్లు చేసినట్లు కోర్టుకు తెలిపారు. ఆర్టీసీ విభజన అంశం కేంద్రం వద్దే పెండింగ్లో ఉందని ఏజీ తెలిపారు. దీనిపై కోర్టు స్పందిస్తూ.. ‘విభజన పెండింగ్లో ఉందంటున్నారు.. కొత్త ఆర్టీసీ ఏర్పాటు చేశామంటున్నారు. విభజన పెండింగ్లో ఉన్నప్పుడు కొత్త ఆర్టీసీ ఏర్పాటు ఎలా సాధ్యం’ అని ప్రశ్నించింది. ఏపీఎస్ఆర్టీసీ విభజన కోసం రెండు రాష్ట్రాలు కేంద్రాన్ని అనుమతి కోరాలి కదా? అని నిలదీసింది. కేంద్రం ఆమోదం లేకుండా రెండు కొత్త సంస్థలు ఎలా ఏర్పాటు చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది
Comments
Post a Comment