తెలంగాణ ఆర్‌టీసీ కార్మికుల పరిస్థితి విచిత్రంగానే కాదు, విషాదభరితంగా ఉంది

తెలంగాణ ఆర్‌టీసీ కార్మికుల పరిస్థితి విచిత్రంగానే కాదు, విషాదభరితంగా ఉంది. సమ్మె కథను కంచికి చేర్చాలనుకుంటే అది చివరకు మరింత పీటముడిపడిపోయింది. ఆ ముడి ఎలా వీడుతుంది? కథ ఎలా కంచికి వెళుతుంది? అనేది అయోమయంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఆర్‌టీసీ కార్మికులు సమ్మెలు చేశారుగాని ఇంతటి క్లిష్ట, గడ్డు పరిస్థితిని ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఇలా జరుగుతుందని వారు ఎన్నడూ ఊహించలేదు. కార్మికులు కావొచ్చు, ఉద్యోగులు కావొచ్చు..డిమాండ్లు తీర్చాలని సమ్మె చేయడం సహజమే. కార్మికులు సమ్మె చేస్తే ఏ ప్రభుత్వమైనా కొంతకాలం బెట్టుగా వ్యవహరించి తరువాత ఏవో చర్చలు జరిపి, కార్మికులతో బేరమాడి కొన్ని డిమాండ్లు తీర్చి, కొన్ని తీర్చక, కొన్ని తరువాత తీరుస్తామని హామీ ఇచ్చి..ఇలా ఏదో విధంగా సమ్మెను పరిష్కరిస్తుంది.  పాపం..తెలంగాణ ఆర్‌టీసీ కార్మికులు అలాగే అనుకున్నారు. కాని ‘డామిట్‌ ..కథ అడ్డం తిరిగింది’ అని తెలిసేసరికి ఏం చేయాలో అర్థంకాక తల పట్టుకున్నారు. 47 రోజులపాటు డిమాండ్ల సాధన కోసం ఎంత ఆందోళన చేయాలో అంతా చేశారు. రకరకాల రూపాల్లో ఆందోళన చేశారు. ‘మా చావుతోనైనా డిమాండ్లు పరిష్కారం కావాలె’ అని పిచ్చి ఆలోచన చేసి కొందరు ప్రాణాలు తీసుకుంటే, కొందరు బతుకు భయంతో గుండెపోటుకు గురై చనిపోయారు. కొందరు కుటుంబం గడవక కూలినాలి చేసుకుంటున్నారు. ‘విలీనం డిమాండు వదులుకున్నాం. మిగతావాటిల్లో కొన్నైనా తీర్చండి. చర్చలకు పిలవండి’ అని అడిగారు. చివరకు గత్యంతరం లేక ‘సమ్మె విరమించాం. విధుల్లో చేరతాం’ అన్నారు. కేసీఆర్‌ మనసు కరగలేదు. ఆర్‌టీసీ కార్మికులు డిమాండ్ల సాధన కోసం సమ్మె మొదలుపెట్టారు. వివిధ రూపాల్లో ఆందోళనలు చేశారు. సమ్మె విడిచి విధుల్లో చేరాలని కేసీఆర్‌ మూడుసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా సమ్మె కొనసాగించారు. హైకోర్టు చేతులెత్తేశాక ఇప్పట్లో ఈ కథ కంచికి వెళ్లేది కాదని అర్థమయ్యాక సమ్మె విరమించామని, విధుల్లో చేరతామని చెప్పారు. కాని కేసీఆర్‌ ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టేశాడు. మొన్నటివరకు  విధులు బహిష్కరించి ఆందోళన చేయగా, ఇప్పుడు విధుల్లో చేరతామంటే ఆందోళన చేస్తున్నారు. కేసీఆర్‌ను ధిక్కరించి మాట్లాడిన కార్మికులు నిన్నటినుంచి చేతులు జోడించి వేడుకుంటున్నారు. ‘కేసీఆర్‌లాంటి సీఎంలను చాలామందిని చూశాం’ అని తల ఎగరేసిన కార్మికులు, ‘పనిచేస్తాం మహాప్రభో’ అని అభ్యర్థిస్తున్నారు. పిడికిళ్లు బిగించిన కార్మికులు ఇప్పుడు చేతులు జోడిస్తున్నారు. నిజంగా ఇదో విచిత్రమైన పరిస్థితి, పరిణామం. ‘రాజెక్కువా?..మొండి ఎక్కవా? అంటే మొండే ఎక్కవ’ అని తెలుగులో ఓ సామెత ఉంది. మొండివాడితో పోలిస్తే రాజు కూడా తక్కువే అని అర్థం. కాని తెలంగాణలో రాజు, మొండి రెండూ సీఎం కేసీఆరే. దీంతో ఆర్‌టీసీ కార్మికుల పట్టుదల వీగిపోయింది. ఆర్‌టీసీ సమ్మెను అడ్డం పెట్టుకొని కేసీఆర్‌ను ఏదో చేయాలనుకున్న ప్రతిపక్షాలు డంగైపోయాయి. కేసీఆర్‌ పాలన సాగినంతకాలం సమ్మె చేయడానికి ఇంకెవరైనా సాహసిస్తారా? సాగినంతకాలం ఆయనంతటివాడు లేనట్లేనా? 

Comments

Popular posts from this blog

కేసీఆర్ సంచలన నిర్ణయం... కార్మికులు అంగీకరిస్తారా...?

ఆ భార్యభర్తల జీవితంలో అనూహ్య ట్విస్ట్.. సిగ్గుతో తలదించుకునేలా..