సర్వోన్నత న్యాయస్థానం బుధవారం బిజీబిజీగా ఉండనుంది
దిల్లీ:
సర్వోన్నత న్యాయస్థానం బుధవారం బిజీబిజీగా ఉండనుంది. ఏళ్ల నాటి అయోధ్య భూవివాదం కేసులో గతవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. రేపు మరో రెండు కీలక కేసులను పరిష్కరించనుంది. శబరిమల, రఫేల్ కేసుల్లో న్యాయస్థానం ఇచ్చిన తీర్పులపై దాఖలైన రివ్వ్యూ పిటిషన్లపై కోర్టు రేపు తీర్పులివ్వనుంది.
శబరిమల వ్యవహారం..
కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి 10 నుంచి 50ఏళ్ల వయసు మహిళల ప్రవేశంపై ఏళ్ల తరబడి కొనసాగుతున్న నిషేధాన్ని సుప్రీంకోర్టు ఎత్తివేసిన విషయం తెలిసిందే. శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ 2018 సెప్టెంబరు 28న సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పదుల సంఖ్యలో రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపి ఫిబ్రవరి 6న తీర్పును రిజర్వ్లో పెట్టింది. తాజాగా రేపు తీర్పు వెలువరించనుంది.
రఫేల్ వివాదం..
దేశంలో రాజకీయ వివాదానికి తెరలేపిన రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో కేంద్రానికి క్లీన్చిట్ ఇస్తూ 2018 డిసెంబరు 14వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ ఒప్పందంలో వాస్తవ విషయాల్ని కోర్టుకు చెప్పకుండా కేంద్రం తొక్కిపెట్టిందని ఆరోపిస్తూ మాజీ మంత్రులు యశ్వంత్సిన్హా, అరుణ్శౌరీ, న్యాయవాది ప్రశాంత్ భూషణ్లు పిటిషన్లు దాఖలుచేశారు. వీటిపై చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయి, జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ కె.ఎం.జోసెఫ్ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి మే 10న తీర్పును రిజర్వ్లో పెట్టింది.
దీంతో పాటు కాంగ్రెస్ నేత రాహుల్గాంధీపై కోర్టు ధిక్కరణ కేసులోనూ సుప్రీం తీర్పునిచ్చే అవకాశముంది. రఫేల్పై సుప్రీం తీర్పు సమయంలో ప్రధాని మోదీ ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. ఈ నినాదాన్ని రఫేల్ తీర్పునకు వర్తింపచేసినందుకుగాను రాహుల్ ఇప్పటికే సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. కోర్టు తీర్పునకు ఆ నినాదాన్ని రాహుల్ తప్పుగా అన్వయించారని ఆయనపై భాజపా ఎంపీ మీనాక్షి లేఖి కోర్టుధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ రంజన్గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం రేపు తీర్పు వెలువరించే అవకాశాలున్నాయి
Comments
Post a Comment