సిగ్నల్ ట్యాంపరింగ్ చేస్తూ రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న పార్థి ముఠా సభ్యుడిని మహబూబ్నగర్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు
సికింద్రాబాద్:
సిగ్నల్ ట్యాంపరింగ్ చేస్తూ రైళ్లలో దోపిడీలకు పాల్పడుతున్న పార్థి ముఠా సభ్యుడిని మహబూబ్నగర్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం సికింద్రాబాద్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సికింద్రాబాద్ రూరల్ డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, అర్బన్ డీఎస్పీ రాజేంద్రప్రసాద్లు వివరాలను వెల్లడించారు. మహారాష్ట్ర షోలాపూర్నకు చెందిన బాలాజీ శ్రీరాంగ్ షిండే అలియాస్ బాలాజీ షిండే(25) పార్థి ముఠాలోని తొమ్మిది మందిలో ఒకడు. రైలు సిగ్నల్ ట్యాంపరింగ్లో సిద్ధహస్తుడు. 2016 నుంచి ముఠాలో పనిచేస్తున్నాడు. రైల్వే యాప్ ద్వారా రైలు వచ్చే సమయాన్ని గుర్తించి నిర్దేశిత ప్రాంతానికి రైలు చేరుకుని నిలిచేలా సిగ్నల్ ట్యాంపరింగ్కు పాల్పడుతుంటారు. రైలు ఆగిన వెంటనే ముఠా సభ్యుల్లో కొందరు కింద వంగి ఉండగా వారిపై మరికొందరు ఎక్కి స్లీపర్ కోచ్లో కిటికీ పక్కన కూర్చున్న మహిళల మెడల్లోని బంగారు గొలుసులను లాక్కుని పారిపోతారు. పట్టుకునేందుకు ప్రయత్నిస్తే రాళ్లతో దాడి చేస్తారు. గత ఏడాది సెప్టెంబర్లో పార్థి గ్యాంగ్ మహబూబ్నగర్ కౌకుంట్ల రైల్వేస్టేషన్ వద్ద సిగ్నల్ను ట్యాంపరింగ్ చేసి, ఆ సమయంలో వచ్చిన యశ్వంత్పూర్, జబల్పూర్ ఎక్స్ప్రెస్ రైళ్లలో దోపిడీకి పాల్పడ్డారు. ప్రయాణికులపై రాళ్లతో దాడి చేశారు. 2018 సెప్టెంబర్ 22న అదే జిల్లాలోని దివిటిపల్లి రైల్వేస్టేషన్ వద్ద యశ్వంత్పూర్ రైల్లోని ప్రయాణికులపై దాడి చేసి 37.5 తులాల బంగారు నగలను దోచుకెళ్లారు. రైల్వే అదనపు డీజీపీ సందీప్ శాండిల్యా ఆదేశాల మేరకు నిజామాబాద్ లైన్ ఇన్స్పెక్టర్ వెంకటరాములు, మహబూబ్నగర్ జీఆర్పీ ఎస్సై రాఘవేందర్, సిబ్బందితో బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. ముఠాలోని ఏడుగురిని ఆరు నెలల క్రితం అరెస్ట్ చేశారు. వారు ప్రస్తుతం జైలులో ఉన్నారు. తప్పించు తిరుగుతున్న ఇద్దరిలో బాలాజీ పిండేను సోమవారం మహబూబ్నగర్ రైల్వేస్టేషన్ వద్ద అరెస్టు చేశారు. నిందితుడి నుంచి తులం బంగారు కమ్మలు స్వాధీనం చేసుకున్నారు
Comments
Post a Comment