సుప్రీం తీర్పుపై దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది
న్యూఢిల్లీ
అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసుపై తుది తీర్పు నేడే వెలువడనుంది.
సుప్రీం తీర్పుపై దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నేడు ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించే అవకాశం ఉంది.
ఈ ధర్మాసనంలో జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్లు ఉన్నారు.
రాజకీయంగా సున్నితమైన అయోధ్య కేసుపై 40 రోజుల పాటు సుదీర్ఘ విచారణ చేపట్టిన ధర్మాసనం అక్టోబర్ 16న తీర్పును రిజర్వ్ చేసింది.
సహజంగా శనివారం కోర్టుకు సెలవు దినం. అయినప్పటికీ.. నేడే తుది తీర్పును ఇవ్వాలని నిర్ణయించింది అత్యున్నత న్యాయస్థానం.
తుది తీర్పుపై అధికారిక నోటిఫికేషన్ వెలువడే ముందు భారత ప్రధాన న్యాయముూర్తి జస్టిస్ రంజన్ గొగొయి ఉత్తర్ప్రదేశ్ ఉన్నతాధికారులతో భేటీఅయ్యారు.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రభుత్వం చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు.
అయోధ్య కేసుపై తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఇప్పటికే కేంద్ర హోంశాఖ వివిధ రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది.
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో సుమారు 4వేల మంది పారా మిలటరీ సిబ్బందిని మోహరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. ఈనెల 11 వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
అయోధ్యలో భద్రత పర్యవేక్షణకోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు.
అత్యవసర పరిస్థితుల కోసం అయోధ్య, లఖ్నవూలో రెండు హెలికాప్టర్లను అందుబాటులో ఉంచారు.
దేశవ్యాప్తంగా సున్నితమైన ప్రాంతాల్లోనూ భారీగా బలగాలను మోహరించారు. కర్ణాటక, జమ్ము, మధ్యప్రదేశ్లోని కీలక ప్రాంతాల్లో 144 సెక్షన్తో పాటు పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పును ప్రజలంతా గౌరవించాలని వివిధ మతాలకు చెందిన పెద్దలు, పూజారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
శాంతియుత, సామరస్య వాతావరణం నెలకొనేలా చేయటం ప్రతి పౌరుడి బాధ్యతగా పేర్కొన్నారు.
Comments
Post a Comment