బైబై.. 2019 ఎన్జే2 .. భూమికి సమీపం నుంచి దూసుకెళ్లిన గ్రహశకలం .. మళ్లీ 2119 జూలై 7న భూమికి దగ్గరగా రాక .. న్యూఢిల్లీ: వింటి లాగివదిలిన బాణంలా రోదసిలో దూసుకెళ్తున్న గ్రహశకలం.. 2019 ఎన్జే2! 207 అడుగుల వ్యాసం ఉన్న ఈ గ్రహశకలం గంటకు 48,280 కిలోమీటర్ల వేగంతో విశ్వంలో ప్రయాణిస్తోంది. భారత కాలమానం ప్రకారం, శుక్రవారం అర్ధరాత్రి దాటాక 1.30 గంటలకు ముందు.. భూమికి అత్యంత సమీపం నుంచి.. అనగా కేవలం 31 లక్షల మైళ్ల దూరం నుంచి ఇది దూసుకుపోయింది. 31 లక్షల మైళ్లంటే మనకు బాగా ఎక్కువే అనిపించొచ్చుగానీ, ఈ విశాల విశ్వాన్ని అందులోని గ్రహాల మధ్య దూరాన్ని లెక్కలోకి తీసుకుంటే ఖగోళ శాస్త్రజ్ఞుల లెక్కప్రకారం ఇది బాగా దగ్గర కిందే లెక్క. మళ్లీ ఇది మన భూమిని 2119, జూలై 7న.. అంటే దాదాపు వందేళ్ల తర్వాత పలకరించనుంది. అప్పుడు అది భూమికి 2.38 కోట్ల మైళ్ల దూరం నుంచి వెళ్లనుంది.