బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టే బిల్లులు, వివిధ చట్టాలకు చేయాల్సిన సవరణలపై రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ కానుంది.
అమరావతి
బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టే బిల్లులు, వివిధ చట్టాలకు చేయాల్సిన సవరణలపై రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ కానుంది.
ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్లో ఈ సమావేశం జరగనుంది.
ఈ భేటీలో అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు కీలక బిల్లులు, చట్టసవరణల ముసాయిదాలకు కేబినేట్ ఆమోదం తెలపనుంది.
కొత్త చట్టాల రూపకల్పనతో పాటు కొన్ని చట్టాలకు సవరణలను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది.
ఇవాల్టి మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడోసారి సమావేశం అవుతున్న కేబినేట్ కొత్త బిల్లులు, చట్ట సవరణల ముసాయిదాలకు ఆమోదాన్ని తెలపనుంది.
సీఎం జగన్ అధ్యక్షతన ఉదయం 8 గంటలకు సచివాలయంలో మంత్రివర్గం భేటీకానుంది.
మొత్తం 12 బిల్లులను సభలో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పాదయాత్రలో ఇచ్చిన హామీలు, నవరత్నాల పథకాలకు అనుగుమంగా కీలక చట్టాల్లో సవరణలు చేయనున్నారు.
ప్రభుత్వ టెండర్లను పారదర్శకంగా నిర్వహించేందుకు జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది.
వీటికి సంబంధించి ఏపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎనేబిలింగ్ యాక్టు 2001 చట్ట సవరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
కేబినేట్ చర్చించే అంశాలు
లోకాయుక్త నియామకానికి సంబంధించి విశ్రాంత హైకోర్టు చీఫ్ జస్టిస్ను నియమించే సవరణకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.
విద్యుత్ నియంత్ర మండలి సిఫార్సుల అమలుకు చట్ట సవరణ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణకు ఫీజు నియంత్రణా చట్టంలో సవరణలు, పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే కల్పన, కౌలు రైతులకు అండగా ఉంటామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలుకు పంటపై 11 నెలలపాటు సాగు ఒప్పందం చేసుకునేందుకు వీలు కల్పించేలా మరొక చట్టాన్ని ప్రభుత్వం తీసుకురానుంది.
శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో 50శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందేందుకు తీసుకొచ్చే బిల్లుకు కేబినేట్ ఆమోదముద్ర వేయనుంది.
పాలకమండళ్ల రద్దు, ఏర్పాటు
రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర భూ సర్వే నిర్వహించేందుకు అవసరమైన చట్ట సవరణకు కేబినెట్ ఆమోదించనుంది.
జిల్లా ఆస్పత్రులకు స్వయం ప్రతిపత్తి కల్పించేలా సొసైటీలు, ట్రస్టుల ఏర్పాటుకు అవసరమైన చట్ట సవరణ బిల్లును మంత్రివర్గం ఆమోదించే అవకాశం ఉంది.
తిరుమల తిరుపతి దేవస్థాన ఛైర్మన్, పాలక మండలి సభ్యులను ఎప్పుడైనా తొలగించే నిర్ణయం, దేవస్థానాల పాలకమండళ్ల రద్దు, ఏర్పాటుకు అవకాశం కల్పించేలా హిందూ ధార్మిక చట్టానికి సవరణ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సీఆర్డీఏ అథారిటీ ఛైర్మన్ పదవిని సీఎంను కాకుండా మరొకరికి అప్పగించేలా చట్ట సవరణ తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు తగిన చట్ట సవరణ తీసుకురానుంది.
Comments
Post a Comment