ఇక నుంచి కొత్త పింఛన్
వెయ్యి నుంచి రూ.2,016 అమలు
20న లబ్దిదారులకు
ప్రొసీడింగ్స్ అందజేత : రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం
నూతన మున్సిపల్ బిల్లుకు ఆమోదం
నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సీఎం కేసీఆర్
పెంచిన పెన్షన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ను ఈనెల 20న రాష్ట్రంలోని నియోజకవర్గాల వారీగా లబ్దిదారులకు అందించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. బుధవారం ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో పెన్షన్ల అంశంపై విస్తృతంగా చర్చించి..పలు నిర్ణయాలు తీసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, బీడీ, గీత, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పెన్షన్ను రూ.వెయ్యి నుంచి రూ.2,016కు పెంచాలని నిర్ణయించారు. వికలాంగులు, వృద్ధకళాకారుల పెన్షన్ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచాలని నిర్ణయించారు. పెంచిన పెన్షన్ను 2019 జూన్ నుంచి అమలు చేస్తారు. ఆ నెలకు సంబంధించిన పెన్షన్ను ఈ నెలలో లబ్దిదారులకు అందిస్తారు. పెంచిన పెన్షన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ను ఈనెల 20న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లబ్దిదారులకు అందిస్తారు.
ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మెన్లు పాల్గొంటారు. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం కోరింది. ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ముగిసిన వెంటనే లబ్దిదారులకు పెన్షన్ సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు.
పెంచిన పెన్షన్లను అందించడానికి యేడాదికి రూ. 12వేల కోట్లు ఖర్చవుతుంది. ఇందులో రూ.11,800 కోట్లను రాష్ట్రం భరిస్తుందనీ, రూ.200 కోట్లను కేంద్రం భరిస్తున్నదనీ ప్రభుత్వం పేర్కొంది. వృద్ధాప్య పెన్షన్ల అర్హత వయో పరిమితిని 65 యేండ్ల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామనే ఎన్నికల హామీని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయిం చింది. 57 యేండ్లు నిండిన పేద వృద్ధుల జాబితాను వెంటనే రూపొందించాలంటూ అధికారులను మంత్రివర్గం కోరింది. వీలైనంత త్వరలో లబ్దిదారుల జాబితా రూపొందించి, దాని ప్రకారం పెంచిన పెన్షన్ అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
బీడీ కార్మికుల పి.ఎఫ్. కటాఫ్ డేట్ ను తొలగించాలని నిర్ణయించింది. బుధవారం (17-07-2019) నాటి వరకు కూడా పి.ఎఫ్. ఖాతా ఉన్న కార్మికులకు పెన్షన్ అందించాలని అధికారులను ఆదేశించింది.
నూతన మున్సిపల్ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను మంత్రివర్గం ఆమోదించింది. గురువారం ఈ బిల్లును ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. అసెంబ్లీలో, శాసనమండలిలో బిల్లుపై చర్చ జరుగుతుంది.
Comments
Post a Comment