ఇవన్నీ పాత పద్ధతులు. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు పంథా మార్చారు.
హైదరాబాద్:
ఇవన్నీ పాత పద్ధతులు. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు పంథా మార్చారు. ప్రతి ఒక్కరి చరవాణిలో కనిపించే సామాజిక మాధ్యమమైన వాట్సప్నే వేదికగా చేసుకొని దండుకోవడం మొదలుపెట్టారు. ఉద్యోగ ప్రకటన ఇవ్వడం, ఫోన్లోనే ఇంటర్వ్యూ అయిందనిపించడం, ఉద్యోగానికి ఎంపికయ్యావంటూ ఉత్తుత్తి నియామక పత్రం ఇవ్వడం అంతా వెంటవెంటనే చేసేస్తున్నారు. ఈ మధ్యలోనే ‘ప్రాసెసింగ్ రుసుం’ పేరిట అందినకాడికి లాగేసుకుని ఫోన్లు స్విచ్ఆఫ్ చేస్తున్నారు. దర్యాప్తు బృందాలకు చిక్కకుండా అంతా వాట్సప్ కాల్స్తోనే బురిడీ కొట్టిస్తున్నారు. బాధితులు మోసపోయాక మేల్కొని సైబర్క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకు తాజాగా ఈ తరహా మోసాలపై ఫిర్యాదులొస్తున్నాయి.
ఉద్యోగం వచ్చిందని రూ.2.8లక్షలు..
ఎల్బీనగర్ చంద్రపురికాలనీకి చెందిన యువతి(24) వాట్సప్ నంబరుకు ఓ గ్రూపులో ఉద్యోగ ప్రకటన వచ్చింది. ఆమె రాహుల్ పేరుతో ఉన్న నంబరుకు ఫోన్ చేసింది. అవతలి వ్యక్తి నగరంలో పేరొందిన సాఫ్ట్వేర్ సంస్థ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. ఆమె అర్హతకు తగ్గ ఉద్యోగం ఇస్తానంటూ ఫోన్లోనే ఇంటర్వ్యూ చేశారు. ఉద్యోగానికి ఎంపికయ్యావంటూ ప్రాసెసింగ్ రుసుం పేరిట కొంతమొత్తం చెల్లించాలని సూచించాడు. ఈ క్రమంలో మహ్మద్ అలీ, మహ్మద్ రేష్మా పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలకు డబ్బు పంపించాలని ఆగంతుకుడు సూచించాడు. బాధితురాలు రూ.2.8లక్షల్ని చెల్లించింది. తర్వాత స్వప్న పేరుతో మాట్లాడిన యువతి బాధితురాలి మెయిల్కు ఉద్యోగ నియామకపత్రాన్ని పంపించింది. దాని ప్రకారం ఫిబ్రవరి 20న ఉద్యోగంలో చేరాల్సి ఉంది. ఈ లోగా ఆగంతుకులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఉద్యోగంలో చేరాల్సిన తేదీ వాయిదా వేస్తూ వచ్చారు. అనుమానం వచ్చి బాధితురాలు మాదాపూర్లోని సదరు సంస్థను సంప్రదించి ఆరా తీయగా నియామక పత్రం బోగస్ అని తేలింది. అప్పటికే ఆగంతుకుల ఫోన్ స్విచ్ఆఫ్ అని వస్తుండటంతో సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
లాటరీ గెలిచావంటూ.. రూ.25లక్షలు
అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారం గ్రామానికి చెందిన మెకానిక్(39)కు గత నెల 26న ్ఘవాట్సప్ కాల్ వచ్చింది. కౌన్బనేగా కరోడ్పతి లక్కీడ్రాలో రూ.25లక్షలు గెలుచుకున్నావంటూ అవతలివ్యక్తి చెప్పాడు. కాకపోతే ప్రాసెసింగ్ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నాడు. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా 15 మంది బాధితుడితో వాట్సప్కాల్స్లో మాట్లాడారు. ఒక్కో విడత ఒక్కో రకం రుసుం పేరు చెబుతూ మొత్తం 12 విడతల్లో రూ.1.85లక్షలు వసూలు చేశారు. అయిదు రోజుల్లో ఎస్బీఐ బ్యాంకుకు చెందిన పది ఖాతాల్లోకి ఆ డబ్బును బదిలీ చేయించుకున్నారు. ఎంతకీ ప్రైజ్మనీ అందకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశారు.
షేర్ మార్కెట్ కిటుకులంటూ..
బోడుప్పల్ ఈదయ్యనగర్ కాలనీకి చెందిన వ్యాపారి(44)ని గతేడాది అక్టోబరులో ఓ వ్యక్తి ఫోన్లో సంప్రదించాడు. తాను షేర్మార్కెట్లో సాంకేతిక సలహాదారుడిగా చెప్పుకొన్నాడు. షేర్లలో లాభదాయక పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన కిటుకులు చెబుతానన్నాడు. ఈక్రమంలో పారుల్గుప్తా పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాతోపాటు గూగుల్పే ఖాతాకు బాధితుడు రూ.9.14 లక్షల్ని బదిలీ చేశాడు. అయినాసరే బాధితుడికి ఎలాంటి సలహాలు చెప్పకపోగా మరింత నగదు బదిలీ చేయాలని ఆగంతుకులు ఒత్తిడి చేయడంతో సైబర్క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించారు
Comments
Post a Comment