కుమార్తెలున్న తల్లి దండ్రులకు ఠాకూర్ సామాజిక వర్గం కఠినమైన షరతులు
అహ్మదాబాద్ :
గుజరాత్లో కుమార్తెలున్న తల్లి దండ్రులకు ఠాకూర్ సామాజిక వర్గం కఠినమైన షరతులను విధించనుంది. కులాంతర వివాహాల పట్ల తమ కుమార్తెలను తల్లిదండ్రులు ప్రోత్సహించ కూడదని ఠాకూర్ కమ్యూనిటీ ఆదేశాలు జారీ చేసింది. అవివాహిత కుమార్తెలకు సెల్ఫోన్స్ ఇవ్వరాదని కూడా నిషేదాజ్ఞలు విధిస్తూ... ఇతర సామాజిక వర్గా నికి చెందిన వ్యక్తిని వివాహమాడినా, యువతులు మొబైల్ను కలిగి ఉన్నా తల్లిదండ్రులకు జరిమానా విధించాలని ఠాకూర్ కమ్యూనిటీ నిర్ణయం తీసు కుంది. ఈ మేరకు రాష్ట్రంలోని బనస్కాంత జిల్లాలోని 12 గ్రామాల కమ్యూనిటీ పెద్దలు, నేతల ఏర్పాటు చేసిన సమావేశం జులై 14న ఏకగ్రీవంగా ఆదేశాలు జారీ చేసింది.
కులాంతర వివాహం చేసుకుంటే జరిమానా..!
ఈ సామాజిక వర్గానికి చెందిన తల్లితంద్రులు తమ పిల్లలకు కులాంతర వివాహం జరిపిస్తే రూ.1.5 లక్షల నుండి రూ.2 లక్షల వరకు జరిమానా కట్టాల్సి ఉంటుందని సమావేశంలో కులపెద్దలు నిర్ణయిం చారు. యువతులు చదువులపై దృష్టి సారించేందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నామని సంఘ పాలక మండలి సభ్యుడు సురేష్ ఠాకూర్ తెలిపారు. కళాశాలకు వెళుతున్న విద్యార్థినులకు ల్యాప్ట్యాప్, ట్యాబ్లెట్స్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా విహవా వేడుకల్లో అనవసరంగా ఖర్చుపెడుతున్న అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. డిస్కో జాకీలు, పటాసులు, వాహనాలపై ఊరేగింపు, గుర్రంపై పెళ్లికుమారుడు సవారీ వంటి వాటికి అధిక ఖర్చును తగ్గించాలని నిర్ణయించారు. వాటి ద్వారా ఆదా చేసిన డబ్బును తమ సామాజిక వర్గం విద్యకు ఉపయోగించనుందని ఠాకూర్ తెలిపారు.
యువతులు సెల్ఫోన్స్ వాడకంపై నిషేధం..
'అవివాహిత యువతులకు మొబైల్ ఫోన్స్ ఇవ్వ రాదు. వారు మొబైల్ ఫోన్స్తో చిక్కితే, దానికి తల్లిదం డ్రులు బాధ్యత వహించడంతో పాటు సంఘ పాలక మండలి విధించిన జరిమానాను భరించాల్సి ఉంటుంది' అని పేర్కొంది. చదువుకునే కుమార్తెలకు ఫోన్స్ ఇవ్వరాదని పాలక మండలి సదరు తల్లిదండ్రు లను ఆదేశించింది. దీనివల్ల సోషల్ మీడియాపై సమయాన్ని వృథా చేస్తున్న వారు చదువులపై దృష్టిసారించే అవకాశం ఉందని పేర్కొంది.
టెక్నాలజీకి దూరంగా ఉండండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఈ ఆదేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జెనిబెన్ ఠాకూర్ మద్దతు పలికారు. యువత తమ విలువైన సమయాన్ని, డబ్బును సోషల్ మీడియా కోసం వినియోగిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. టెక్నాలజీకి దూరంగా ఉండి చదువులపై దృష్టిసారించాలని పేర్కొన్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేత అల్పేష్ ఠాకూర్ కూడా ఈ నిర్ణయాలపై హర్షం వ్యక్తం చేశారు. వివాహంలో డిజె, ఇతర అనవరసరపు ఖర్చులు తగ్గించుకోవాలన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. మొబైల్ఫోన్స్ను ఇరువురు(బాలబాలికలు) వినియోగించకపోవడం ద్వారా చదువులపై దృష్టి పెట్టేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు
Comments
Post a Comment