జగన్ కేవలం మంచి పాలన ఇస్తే సరిపోదు... ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు
ఏపీ కొత్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ పరిపాలనపై మాజీ ఎంపీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని అట్లాంటాలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకలు పాల్గొన్న ఉండవల్లి... వైఎస్ఆర్తో తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తాను వంద రోజుల పాటు రాజకీయాలు మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానన్న ఉండవల్లి...వైఎస్ అభిమానుల కోరిక మేరకు జగన్ పరిపాలనపై పలు వ్యాఖ్యలు చేశారు. జగన్ కేవలం మంచి పరిపాలన అందిస్తే సరిపోదన్న ఉండవల్లి... ఆయన తన తండ్రి వైఎస్ఆర్ను మరిపించేలా అద్భుతమైన పాలన, గొప్పగా పాలన అందించాలని సూచించారు.
ఏపీ ప్రజలు జగన్ నుంచి ఇదే ఆశిస్తున్నారని అన్నారు. ఇది ఒక రకంగా సీఎం జగన్ మోహన్ రెడ్డికి పెద్ద సవాలే అని ఉండవల్లి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వేసే అడుగులు ఆ దిశగానే ఉన్నాయని... తన ప్రయత్నంలో సఫలీకతుడవుతాడనే భావిస్తున్నానని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తనకున్న అనుబంధం ఒక పార్టీ అధినేతకు, కార్యకర్తకు ఉన్న సంబంధం మాత్రమే అన్న ఉండవల్లి... ఆయనకు తనలోని కొన్ని అంశాలు నచ్చడం వల్ల తనను ఎంపీ చేశారని అన్నారు.
Comments
Post a Comment