సీసా తెచ్చిన సందేశం.. ఏంటీ
కాన్బెరా(ఆస్ట్రేలియా):
సీసా తెచ్చిన సందేశం.. ఏంటీ శివమణి సినిమా అనుకుంటున్నారా! కాదు, అందులోని ఓ సన్నివేశం తరహాలోనే ఆస్ట్రేలియాలో ఓ ఘటన జరిగింది. 50ఏళ్ల క్రితం కాగితంపై ఓ సందేశం రాసి సీసాలో పెట్టి సముద్రంలో పడేయగా.. అది ఇప్పుడు దొరికింది. ఆస్ట్రేలియా దక్షిణ తీర ప్రాంతంలో పాల్ ఎలియట్ అనే మత్స్యకారుడు అతని కుమారునితో కలిసి చేపల వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో బీచ్లో ఓ సీసా వారి దృష్టిని ఆకర్షించింది. వెంటనే దగ్గరికి వెళ్లి చూడగా.. అందులో ఓ కాగితం ఉండడం గమనించారు. తీసి చూస్తే 50ఏళ్ల క్రితం తేదీతో ఓ సందేశం ఉంది. లేఖ రాసిన వ్యక్తి 13 ఏళ్ల పాల్ గిబ్సన్ అనే ఇంగ్లీష్ బాలుడని.. అతను ఓ నావలో ఆస్ట్రేలియాకు పశ్చిమాన ఉన్న ఫ్రెమాంటిల్ నుంచి తూర్పున ఉన్న మెల్బోర్న్కు ప్రయణిస్తున్నట్లు లేఖలో ఉందని ఎలియట్ తెలిపాడు. అలాగే సీసా సముద్రంలో వేసిన సమయానికి ఫ్రెమాంటిల్కి తూర్పున 1000 మైళ్ల దూరంలో అతను ఉన్నట్లు లేఖలో పేర్కొన్నారన్నారు.
దీనిపై ఆస్ట్రేలియాకు చెందిన ఓ ప్రముఖ సముద్ర శాస్త్రవేత్త స్పందించారు. అది 50ఏళ్ల నుంచి నీటిలో తేలుతూ ఉండే అవకాశం లేదన్నారు. అలల ధాటికి ఒడ్డుకు కొట్టుకువచ్చి మట్టిలో కూరుకుపోయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాలకు అది పైకి తేలి ఉంటుందన్నారు.
అయితే 1960లో అనేక మంది బ్రిటీషు వారు ఆస్ట్రేలియాకు వలసవెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. దీనికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రయాణ ఖర్చుల్లో రాయితీలు సైతం కల్పించింది. చిన్నారులను ఉచితంగానే అనుమతించారు. కానీ, అనుకున్న స్థాయిలో జీవనం సాగకపోవడంతో చాలా మంది తిరిగి వెళ్లిపోయారు
Comments
Post a Comment