కాంగ్రెస్కు బిగ్ షాక్ : పార్టీకి గుడ్బై చెప్పనున్న కొండా దంపతులు?
ఒకప్పుడు తెలంగాణలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఉనికి కోసం అనేక పాట్లు పడుతోంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్దండులు సైతం మట్టి కరవడంతో పార్టీ ఉనికి మరింత ప్రశ్నార్థకంగా మారింది. అయితే లోక్సభ ఎన్నికల్లో 3 ఎంపీ స్థానాలతో పార్టీ తిరిగి పుంజుకోవడంతో.. టీఆర్ఎస్ను నిలువరించే సత్తా కాంగ్రెస్కే ఉందని ఆ పార్టీ నేతల్లో ధీమా పెరిగింది. అయినప్పటికీ పార్టీ నుంచి వలసలు మాత్రం ఆగకపోవడం గమనార్హం. లోక్సభ ఎన్నికల తర్వాత 12మంది కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో చేరిపోయారు. మరికొంతమంది బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ కంటే బీజేపీలోనే రాజకీయ భవిష్యత్ ఉంటుందని భావిస్తున్నవారు.. టీఆర్ఎస్కు కమలం పార్టీయే ప్రత్యామ్నాయం అని భావిస్తున్నవారు.. ఆ గూటికి చేరిపోతున్నారు. ఇప్పుడా జాబితాలో కొండా దంపతులు కూడా చేరే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత స్తబ్దుగా ఉన్న కొండా దంపతులు.. బీజేపీలో చేరి మళ్లీ యాక్టివ్ అవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే భూపాలపల్లి ఎమ్మెల్యే టికెట్ తమకే ఇవ్వాలన్న షరతుపై వీరు బీజేపీలోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర సత్యనారాయణ కూడా కమలం గూటికి చేరేందుకు సన్నద్దమైనట్టు తెలుస్తోంది. ఆయన కూడా భూపాలపల్లి టికెట్ హామీ మేరకే పార్టీలో చేరాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వీరిద్దరిలో బీజేపీ ఎవరికి ప్రాధాన్యతనిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ టికెట్పై హామీ లభిస్తే త్వరలోనే కొండా దంపతులు పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది.
Comments
Post a Comment