ప్రకాశం జిల్లాలో ఇద్దరు డీఎస్సీలపై వేటు... 54మంది ఎస్ఐల బదిలీలు
ఒంగోలు డీఎస్పీ టి.రాధేష్ మురళి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలు అంజయ్య రోడ్డు, నిర్మల్ నగర్ ప్రాంతాల్లో గుట్కా ప్యాకెట్ల నిల్వలపై గతంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ విషయంలో పోలీసులు కేసులు నమోదు చేయటం లేదని ప్రాంతీయ విజిలెన్స్ అధికారిణి రజని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో ఎస్పీ ఇచ్చిన నివేదిక మేరకు రాధేష్ మురళిని సస్పెండ్ చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. మురళి స్థానంలో ఇన్ఛార్జి డీఎస్పీగా ఎం.బాలసుందరరావు వ్యవహరిస్తున్నారు
మరోవైపు చీరాల డీఎస్పీ కూడా బదిలీ చేశారు.రుద్రామాంబ వరంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలో టీడీపీ కార్యకర్త పద్మ మృతిపై నిర్లక్ష్యం వహించిన పోలీస్ లపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. చీరాల డీఎస్పీ యు.నాగరాజు బదిలీ అయ్యారు. ఆయనను రాష్ట్ర పోలీసు కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశిస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒంగోలులో ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేస్తున్న విక్రమ శ్రీనివాసరావును కూడా బదిలీ చేసి... రాష్ట్ర పోలీసు కేంద్రంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మరోవైపు జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. 54 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.ఇటీవల పోస్టింగ్ పొందిన కొందరు ప్రొబేషనరీ ఎస్సైలు మినహా జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లకు నూతన ఎస్సైలను నియమించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రెండు మూడు స్టేషన్లలో ఎస్సైల మార్పు జరిగింది. ఆ పోస్టింగులను కూడా తాజా జాబితాలో చూపారు. వేకెన్సీ రిజర్వ్(వీఆర్)లో ఉన్న ఇద్దరు ఎస్సైలకు స్టేషన్లు కేటాయించిన ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ 15 మంది ఎస్సైలను వీఆర్కు పంపారు.ఎన్నికల్లో ఏకపక్షంగా పని చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్న కొందరు ఎస్సైలకు ఎక్కడా పోస్టింగ్ దక్కలేదు.
Comments
Post a Comment