యూట్యూబ్లో చూసి ద్విచక్రవాహనం చోరీ
కీసర: యూట్యూబ్లో చూసి ద్విచక్రవాహనం చోరీ చేసిన ఇద్దరు యువకులు 24 గంటల వ్యవధిలో పోలీసులకు చిక్కి కటకటాల్లోకి వెళ్లారు. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
⇒ కీసర సీఐ నరేందర్గౌడ్ వివరాల ప్రకారం కాప్రా మండలం జవహర్నగర్ అంబేడ్కర్నగర్కు చెందిన కడబోయిన నవీన్(25), దమ్మాయిగూడ సాయిప్రియ కాలనీలో అద్దెకు ఉండే ధత్రిక సాయికుమార్(28) ఫుడ్ డెలివరీ బాయ్స్గా పని చేస్తున్నారు. వీరికి ద్విచక్రవాహనం అవసరం ఉండటంతో సొంతంగా కొనుగోలు చేయలేక ఎలాగైన దొంగిలించాలని వ్యూహం పన్నారు. ఇందుకు యూట్యుబ్లో ద్విచక్ర వాహనం ఎలా చోరీ చేయవచ్చో చూశారు. ఈ క్రమంలో కాప్రా మండలం గబ్బిలాల్పేటకు చెందిన ఎస్.పవన్ నాగారంలోని చికెన్ దుకాణంలో పని చేస్తున్నాడు. ప్రతిరోజు ద్విచక్ర వాహనంపై చికెన్ సెంటరకు వచ్చి వెళ్తాడు. రోజూ మాదిరి ఈనెల 26న ఉదయం పవన్ చికెన్ దుకాణానికి వచ్చి తన ద్విచక్ర వాహనాన్ని పక్కన నిలిపాడు. పని ఉండటంతో ఆ రాత్రి దుకాణంలోనే ఉన్నాడు. 27వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో వెళ్లి చూసే సరికి తాను నిలిపిన చోట ద్విచక్రవాహనం లేకపోవడం గమనించాడు. చుట్టుపక్కల వెదికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విస్వసనీయ సమాచారం మేరకు పోలీసులు శుక్రవారం రాంపల్లి చౌరస్తాలో నిఘా పెట్టారు. అనుమానాస్పందంగా తిరుగుతున్న ఇద్దరి యువకులను ఆపి విచారించడంతో నేరం ఒప్పుకొన్నారు. దీంతో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారు. 24 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన ఎస్సై రామసూర్యం, క్రైం సిబ్బందిని సీఐ అభినందించారు.
Comments
Post a Comment