సీఎం జగన్పై తీవ్ర విమర్శలు చేసిన నారా లోకేష్
ఏపీ మాజీ మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా ఆయన పలు విమర్శలు గుప్పించారు.‘దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్లూ ఉంటాయి జగన్ గారూ!అంటూ నారా లోకేష్ తన పోస్టులో పేర్కొన్నారు. ‘దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించలేదు. రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే! అది ఫుల్స్టాప్ అనుకున్నారు మీరు. ఈ గ్యాప్లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాలనుకుంటున్నారు.అంటూ ట్విట్టర్లో వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టుల్లో అవినీతిపై జగన్ వ్యాఖ్యలు చేస్తున్న వేళ నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘దేవుడు కామా తరువాత మళ్లీ స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టాడు. మీరు అవినీతి అన్న పట్టిసీమ మోటార్లు మీతోనే ఆన్ చేయించాడు. అడ్డగోలన్న పోలవరం అంచనాలను యథాతథంగా కేంద్రంతో ఓకే చేయించాడు’ అంటూ మరో పోస్టు పెట్టారు.
అమరావతిని జగన్ భ్రమరావతి అన్నారనీ, ఆయన భ్రమలు తొలగించేందుకు భవంతుడు ఓ ఛాన్స్ ఇచ్చాడని వ్యాఖ్యానించారు. సచివాలయంలో సీట్లో కూర్చున్నప్పుడు, అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడైనా చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పుకో అని భగవంతుడు తన స్క్రిప్ట్ లో కామా పెట్టాడని నాారా లోకేష్ తెలిపారు. ‘టీడీపీ హయాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమం అని మీరంటే.. అవి ముట్టుకుంటే షాక్ కొడతాయని కేంద్రంతో లేఖ రాయించాడు. దేవుడి స్క్రిప్ట్ లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయి.
అంతకుముందు ట్విట్టర్ వేదికగా నారా లోకేష్పై విమర్శలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ప్రస్తుతం ఇరు పార్టీల మధ్య ట్విట్టర్లో వార్ నడుస్తోంది. మరి తాజాగా లోకేష్ చేసిన కామెంట్స్కు వైఎస్ఆర్సీపీ ఎలాంటి కౌంటర్ ఇస్తుందో చూడాలి.
Comments
Post a Comment