హైదరాబాద్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి దేవినేని
విజయవాడ: హైదరాబాద్లో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై ఈ సమావేశంలో జగన్ ఎందుకు మాట్లాడలేదని మండిపడ్డారు. గత నాలుగేళ్లలో 263 టీఎంసీల నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణాకు మళ్లించినట్లు తెలిపారు. బహుదా-వంశధార-నాగావళి లింక్ పనులను ఎందుకు ఆపారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై జగన్కు ఎందుకంత కోపమని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల పనులను ఎందుకు నిలుపుదల చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. ఇరిగేషన్ విషయంలో జగన్ మౌనం.. రాష్ట్ర రైతాంగానికి మంచిది కాదని హితవు పలికారు. గోదావరి-పెన్నా అనుసంధానం పనులను ఎందుకు ఆపారన్న ఉమా.. కృష్ణానది వరదను ఒడిసిపట్టే వైకుంఠాపురం బ్యారేజి పనులను ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు. రాయలసీమ రైతులు ఏం అన్యాయం చేశారని గోదావరి-పెన్నా అనుసంధానం పనులు ఆపారన్నారు. రివర్స్ టెండరింగ్ వంటి సుభాషితాలు ఏపీ బోర్డర్ దాటితే ఎందుకూ పనికి రావడంలేదన్నారు. 512 టీఎంసీల నికర జలాలపై ఏపీకి ఉన్న హక్కులను కాపాడుకోవాలన్నారు. ఆల్మట్టి గేట్లు ఎత్తు పెంచాలని కర్ణాటక, మహారాష్ట్ర కలిసి పోరాడుతున్నాయని, దీనిపై జగన్ ఏం సమాధానం చెబుతారన్నారు. చంద్రబాబు నాయకత్వంలో పనిచేశామని మరణించే వరకు గర్వంగా చెప్పుకుంటామని దేవినేని ఉమా స్పష్టం చేశారు.
Comments
Post a Comment