ఆ బాలింత రక్త గ్రూపు ‘ఒ’ పాజిటివ్... అయితే ‘బి’ పాజిటివ్ గ్రూపు రక్తాన్ని ఎక్కించారు.
అనంతపురం (వైద్యం): ఆ బాలింత రక్త గ్రూపు ‘ఒ’ పాజిటివ్... అయితే ‘బి’ పాజిటివ్ గ్రూపు రక్తాన్ని ఎక్కించారు. ఇది ఎక్కించిన అర గంటలో ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారి... వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లింది. మృత్యువుతో పోరాటం చేస్తూ.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ మూడు గంటల్లో తుదిశ్వాస వదిలింది. ఇది ముమ్మాటికి వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే అని తేలింది. కానీ... మొత్తమీ వ్యవహారాన్ని అన్ని స్థాయుల్లోనూ కప్పిపుచ్చారు. ఏకంగా కలెక్టర్ సత్యనారాయణనే బురిడీ కొట్టించారు. సరికదా... రికార్డులు, బాలింత కేసు షీటు.. ఇలా అన్నింటిని మార్ఫింగ్ చేశారు. ఇంతటితో ఆగలేదు. ఏకంగా రక్త శాంపిళ్లను కూడా మార్పు చేసి తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఈ తతంగంలో ఏదో మతలబు జరిగిందని కలెక్టర్కు అనుమానం వచ్చింది. ఆయనే నేరుగా ఆస్పత్రికి వచ్చి ఆరా తీశారు. లోతుగా తవ్వితే అసలు వ్యవహారం వెలుగు చూస్తుందనే ఉద్దేశంతో ఆఘమేఘాలపై అనంత నగర పాలక సంస్థ కమిషనర్ ప్రశాంతిని విచారణాధికారిగా నియమించారు. ఈమె అర గంటలోపే ఆస్పత్రికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. ఒక్క రోజులోనే నిగ్గు తేల్చారు. జనరల్ సర్జరీ హెచ్ఓడీ ఆచార్య రామస్వామినాయక్, జనరల్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ వి.శ్రీనివాసుల సాంకేతిక సహకారంతో మొత్తం వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. ఈ నయా బాగోతం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
Comments
Post a Comment