గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం రాత పరీక్షలకు పక్కాగా అన్ని ఏర్పాట్లు
సుదూరప్రాంత ‘సచివాలయ’ ఉద్యోగార్థులకు ఉచిత భోజనం ఏర్పాటు
_పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజా శంకర్
అమరావతి: రాష్ట్రంలో 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం సెప్టెంబరు 1 నుంచి నిర్వహిస్తున్న రాత పరీక్షలకు పక్కాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు.
సుదూర ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు వచ్చే అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించారు.
పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు నిమిషం ఆలస్యంగా వచ్చినా, హాజరయ్యాక నిమిషం ముందుగా వెళ్దామన్నా అనుమతించబోమని స్పష్టం చేశారు.
ఈ మేరకు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చామని వెల్లడించారు.
గిరిజా శంకర్ విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసి ఇప్పటికీ హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోని అభ్యర్థులకు వాటిని డౌన్లోడ్ చేసుకోవాలంటూ వారి మొబైళ్లకు సంక్షిప్త సమాచారాన్ని పంపిస్తున్నాం.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు ప్రశ్నపత్రంపై సిరీస్ కోడ్తోపాటు ఇన్విజిలేటర్ సంతకం పెట్టించుకోవాలి.
అభ్యర్థి సంతకం తప్పనిసరి. పరీక్షలు నిర్వహించిన రోజుల్లో ఆర్టీసీ తరఫున ప్రత్యేకంగా బస్సులు నడపనున్నారు.
ఆటో డ్రైవర్లకు సైతం పరీక్ష కేంద్రాల వివరాలు తెలిసేలా సంబంధిత సంఘాలకు సమాచారాన్ని అందిస్తున్నాం.
ఉదయం నిర్వహించిన పరీక్షపై అదే రోజు సాయంత్రం, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలపై మరుసటి రోజు ఉదయం కీ విడుదల చేస్తాం.
అభ్యంతరాలుంటే మూడు రోజుల్లోగా అభ్యర్థులు ఆన్లైన్లో నమోదు చేయొచ్చు.
వీటిని సంబంధిత నిపుణులకు పంపి సందేహాలను నివృత్తి చేసి అదే వెబ్సైట్లో వివరాలు పెడతాం.
ప్రశ్నపత్రం లీకవ్వడం, ఇతర అక్రమాలు చోటుచేసుకోడానికి అవకాశం లేదు.
అభ్యర్థులు ఎవర్నీ నమ్మి మోసపోవద్దు.
అక్టోబరు 1న ఫలితాలు విడుదల చేసే విషయాన్ని పరిశీలిస్తున్నాం.
13 జిల్లాల్లో ఏర్పాటైన పరీక్ష కేంద్రాలు: 5,314
పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు: 21,69,719
Comments
Post a Comment