టాప్ టెన్ న్యూస్...
1. నల్లమలలో.. క్వార్ట్జ్తవ్వకాలు!
ఓవైపు యురేనియం నిక్షేపాల కోసం అన్వేషణ, తవ్వకాలకు ప్రయత్నాలు జరుగుతుండగానే.. నల్లమల అడవుల్లో క్వార్ట్జ్ ఖనిజాన్ని వెలికి తీసేందుకూ రంగం సిద్ధమవుతోంది. తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ) అటవీశాఖతో కలిసి ఇటీవల సర్వే చేసి.. భారీస్థాయిలో క్వార్ట్జ్తో పాటు ఫెల్డ్స్పార్ ఖనిజ నిక్షేపాలున్నాయని గుర్తించినట్లు సమాచారం. మార్కెట్లో వాటికి మంచి గిరాకీ ఉంది. దీంతో వీటి తవ్వకాలపై దృష్టిపెట్టిన టీఎస్ఎండీసీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇటీవల లేఖ రాసింది.
2. రూ.4వేల కోట్లతో అల్యూమినియం పరిశ్రమ
నెల్లూరు జిల్లా బొడ్డువారిపాలెంలో రూ.4వేల కోట్లతో అల్యూమినియం పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు ఈనెల 26వ తేదీన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్లు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాజ్నాథ్సింగ్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డినీ ఆహ్వానించారు. శంకుస్థాపన చేసిన నాటి నుంచి 36 నెలల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేస్తారు.
3. 16 రకాల కియా సెల్టోస్
దక్షిణకొరియా సంస్థ కియా మోటార్స్, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం ప్లాంటులో తయారు చేసిన మధ్యశ్రేణి స్పోర్ట్స్ వినియోగ వాహనం (ఎస్యూవీ) సెల్టోస్ను గురువారం ఇక్కడ విపణిలోకి విడుదల చేసింది. పొరుగు దేశాలతో పాటు దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాలకు కూడా ఇక్కడ నుంచి ఎగుమతి చేస్తామని సంస్థ ప్రకటించింది. పెట్రోల్, డీజిల్లో కలిపి 16 వేరియెంట్లలో లభించే ఈ ఎస్యూవీ ధరలు రూ.9.69-15.99 లక్షలు (ఎక్స్షోరూం హైదరాబాద్)గా సంస్థ ప్రకటించింది.
4. దిల్లీ చరిత్రే దేశ చరిత్ర కాదు
‘భారతదేశ చరిత్ర అంటే దిల్లీ చరిత్ర కాదు. దాన్ని లిఖించినవారు హస్తిన పాలకుల చుట్టూనే పరిభ్రమించారు. అందుకే చరిత్ర దిల్లీ పీఠం గురించే చెప్పింది.’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. దక్షిణాదిన ఎందరో చక్రవర్తులు, సామంతులు మాతృభూమి కోసం త్యాగం చేశారన్నారు. చరిత్రకారులు తెలుగు నేల వైపు చూసి ఉంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీరత్వం సువర్ణాక్షరాలతో లిఖితమయ్యేదని పేర్కొన్నారు. అమితాబ్ బచ్చన్ను గురువారం కలుసుకున్న పవన్ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ఎంతో మధురమైన క్షణాలుగా ఆయన ట్వీట్ చేశారు.
5. అధికారమిచ్చింది అణగదొక్కడానికా?
ప్రజలిచ్చిన అఖండ మెజార్టీ భయానక వాతావరణం సృష్టించడానికో, వ్యవస్థలను విధ్వంసం చేయడానికో కాదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. పేరు పెట్టకుండానే మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేశారు. రాజీవ్ గాంధీ ఎన్నికల్లో పూర్తి ఆధిక్యత సంపాదించినా ఎన్నడూ ఇలాంటి పనులకు పాల్పడలేదని గుర్తుచేస్తూ ప్రభుత్వంపై పరోక్ష విమర్శలు చేశారు. గురువారం రాజీవ్ గాంధీ 75వ జయంతి సందర్భంగా ఇక్కడి కె.డి.జాదవ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.
6. హైదరాబాద్లో సందడి చేసిన సినీ తారలు
7. పింఛను కమ్యుటేషన్ సౌకర్యం పునరుద్ధరణ
పింఛనుదార్లకు ఊరట కలిగించేలా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కీలక నిర్ణయం తీసుకొంది. పింఛను కమ్యుటేషన్ (కొంత మొత్తాన్ని ముందుగానే తీసుకునే) సౌకర్యాన్ని పునరుద్ధరించనుంది. గతంలో ఉన్న ఈ సౌకర్యాన్ని 2009లో రద్దు చేయగా, దానిని తిరిగి అమల్లోకి తీసుకురానుంది. 2009 ముందు పదవీ విరమణ చేసి, ఒకేసారి ఏకమొత్తంలో పింఛను తీసుకోవడానికి ఐచ్ఛికాన్ని ఇచ్చిన పింఛనుదార్లకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది.
8. టైమ్ మేగజీన్ జాబితాలో ఐక్యతా ప్రతిమ, సోహో హౌస్లు
టైమ్ మేగజీన్ తాజాగా విడుదలచేసిన ప్రపంచంలోని వంద అత్యంత గొప్ప స్థలాల జాబితా (2019)లో గుజరాత్లోని ఐక్యతా ప్రతిమ, ముంబయిలోని సోహో హౌస్లు చోటు దక్కించుకున్నాయి. ఉక్కు మనిషిగా పేరొందిన సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ స్మృత్యర్థం... ‘ఐక్యతా ప్రతిమ’ పేరున 597 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆసియాలోని తొలి సోహో హౌస్గా పేరుగాంచిన ముంబయిలోని 11 అంతస్తుల భవంతి కూడా టైమ్స్జాబితాలో చోటు సంపాదించుకోవడం విశేషం.
9. రోదసిలోకి హ్యూమనాయిడ్రోబో
భూకక్ష్యలో తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వ్యోమగాములకు తోడుగా ఒక హ్యూమనాయిడ్ రోబో కూడా జత చేరనుంది. మానవుడి పరిమాణంలో ఉన్న ఒక ‘యంత్రుడి’ని రష్యా గురువారం సోయజ్ ఎంఎస్-14 వ్యోమనౌక ద్వారా రోదసిలోకి పంపింది. అది శనివారం ఐఎస్ఎస్ను చేరుతుంది. అక్కడే పది రోజుల పాటు గడిపి, వ్యోమగాములకు సాయం చేయడంపై శిక్షణ పొందుతుంది.
10. పోరాడిన రహానె
టీ20, వన్డే సిరీస్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియాకు టెస్టు సిరీస్లో తొలి రోజు గట్టి సవాలే ఎదురైంది. విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మ్యాచ్పై ఆధిపత్యం సాధించారు. భారత వైస్ కెప్టెన్ అజింక్య రహానె(81; 163బంతుల్లో 10×4) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్(44; 97బంతుల్లో 5×4) రాణించడంతో భారత్ మొదటి రోజు ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. మరోవైపు ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్షిప్లో తెలుగు కుర్రాడు భమిడిపాటి సాయిప్రణీత్ సంచలనం సృష్టించాడు. ప్రపంచ 8వ ర్యాంకర్.. ఆరో సీడ్ ఆంథోనీ జింటింగ్ (ఇండోనేసియా)కు షాకిచ్చి క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లాడు.
Comments
Post a Comment