చిరంజీవి అలాంటి చిల్లర పనులు చేయడంటున్న 30 ఇయర్స్ పృథ్వీ..
కమెడియన్లు కామెడీ చేయాలి.. నవ్వించాలి.. కానీ అందరి ముందు తాము చేసే వ్యాఖ్యలతో నవ్వుల పాలు కాకూడదు కదా. వాళ్లపై వాళ్లే కమెంట్స్ చేసుకుని దిగజారిపోతున్నట్లు కనిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్ ఎంతమంది ఉన్నా అందరికీ మంచి పేరుంది. కానీ ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ 30 ఇయర్స్ పృథ్వీ మాత్రం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ అయిపోతున్నాడు. కావాలనే అందరితోనూ సున్నం పెట్టుకుంటున్నాడు ఈయన. మొన్నటికి మొన్న ఎలక్షన్ సమయంలో 30 ఇయర్స్ పృథ్వీ.. మరో కమెడియన్, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.
ఇక ఆ తర్వాత కమెడియన్ సునీల్పై కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసాడు పృథ్వీ. సునీల్ రీ ఎంట్రీ తర్వాత పొడిచేదేం లేదన్నాడు. ఆ తర్వాత ఏకంగా సినిమా ఇండస్ట్రీపైనే నోరు పారేసుకున్నాడు. వైఎస్ జగన్ గెలిచినా కూడా ఎవరూ వచ్చి విష్ చేయడం లేదంటూ అందరిపై విమర్శల వర్షం కురిపించాడు. ఇక ఇప్పుడు ఏకంగా మెగా కుటుంబాన్నే టార్గెట్ చేసాడు ఈయన. ఎన్నికల సమయంలో కావాలనే మెగా హీరోలందర్నీ లక్ష్యంగా చేసుకుని విమర్శించాడు పృథ్వీ.
పవన్ కళ్యాణ్ మొదలుకొని నాగబాబు, వరుణ్ తేజ్ లాంటి వాళ్లపై కూడా ఇష్టమొచ్చినట్లు కామెంట్ చేసాడు ఈ 30 ఇయర్స్ ఇండస్ట్రీ. అప్పుడు జనసేన పార్టీకి నాగబాబు ఇచ్చిన కోటి రూపాయలు అక్రమంగా సంపాదించినవి కాదా అంటూ రెచ్చిపోయాడు ఈయన. తర్వాత పవర్ స్టార్ పార్టీ గురించి కూడా కామెంట్స్ చేసాడు. ఇవన్నీ మెగా హీరోలకు బాగానే కోపం తెప్పించాయి. దాంతో ఇప్పుడు మెగా హీరోల సినిమాల్లో పృథ్వీని తీసుకోకూడదనే వాదన వినిపిస్తుంది. ఇందులో భాగంగానే ఆ మధ్య ఓ మెగా హీరో సినిమా నుంచి పృథ్వీని తప్పించారు కూడా.
Comments
Post a Comment