హాంకాంగ్లో చైనా వ్యతిరేక ప్రదర్శనలు తీవ్రరూపం దాల్చాయి.
హాంకాంగ్లో చైనా వ్యతిరేక ప్రదర్శనలు తీవ్రరూపం దాల్చాయి. సోమవారం దాదాపు పది లక్షల మంది హాంకాంగ్ వీధుల్లో కదం తొక్కారు.
గత కొద్ది వారాలుగా శాంతియుతంగా జరుగుతున్న ప్రదర్శనలు సోమవారం విధ్వంసానికి దారితీశాయి.
వేల సంఖ్యలో ఆందోళనకారులు పార్లమెంటు (లెజిస్లేటివ్ కౌన్సిల్- లెజ్కో)ను దిగ్బంధించారు. వందలమంది బారికేడ్లను విరగ్గొట్టి భవనంలోకి ప్రవేశించారు. గోడలన్నింటిపైనా పెయింటుతో నినాదాలు రాశారు. జాతీయ చిహ్నాన్ని సైతం పెయింట్ జల్లి చెరిపేశారు.
అద్దాలను బద్దలు కొట్టారు. ఫర్నిచర్ను విరగ్గొట్టారు. తక్షణం పార్లమెంటును విడిచి వెళ్లాలని చైనా భద్రతాసిబ్బంది ఆదేశించినా ఫలితం లేకపోయింది.
చివరకు సోమవారం రాత్రి తుది హెచ్చరిక వెలువడ్డాక అనేకమంది బయటకు వెళ్లిపోయారు.
అయినా పలువురు భవనంలోపలే ఉండి చైనా వ్యతిరేక, బ్రిటన్ అనుకూల నినాదాలు చేశారు. కొందరు వలసకాలం నాటి బ్రిటిష్ పతాకాన్ని కూడా ఎగరేయడానికి ప్రయత్నించారు.
ఆందోళనకారులను చెదరగొట్టేందుకు చైనా పోలీసు దళాలు బాష్పవాయుగోళాలను పెద్ద ఎత్తున ప్రయోగించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ ఆవరించింది.
పరిస్థితి అదుపు తప్పిందని అంతర్జాతీయ వార్తాసంస్థలన్నీ ప్రత్యేక కథనాలు ప్రసారం చేశాయి.
Comments
Post a Comment