అమరావతిపై జగన్ నిర్ణయం ఏంటి ? సీఆర్డీఏతో నేడు సీఎం సమీక్ష...
రాజధాని వ్యవహారాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించనున్నారు. తొలిసారిగా ముఖ్యమంత్రి రాజధానిపై సమావేశం నిర్వహిస్తున్నారు. దీంతో సీఆర్డీఏ అధికారులు నాలుగున్నరేళ్లలో రాజధాని అమరావతి పనులు, వ్యవహారాలకు సంబంధించి నివేదిక తయారు చేశారు. సీఎంకు వివరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ సమావేశం నేపథ్యంలో రాజధాని అమరావతి నిర్మాణంపై వైసీపీ ప్రభుత్వం వైఖరి ఏమిటి? సీఎం జగన్ ఏమనుకుంటున్నారు? అమరావతిపై ఆయన మనసులో మాటేంటి ? అనే అంశం ఈరోజు తేలిపోతుంది. ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు సీఆర్డీఏపై అధికారులతో జగన్ సమీక్ష నిర్వహించనున్నారు.
సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీనరసింహం వివిధ విభాగాల అధికారులతో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సన్నాహక సమావేశం నిర్వహించారు.
మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా రాజధాని ప్రాజెక్టుల నిర్మాణం కోసం రుణం కావాలని ప్రపంచ బ్యాంకు, వివిధ సంస్థలతో జరిపిన సంప్రదింపులు, ప్రస్తుత పరిస్థితిపై చర్చ జరిగింది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద కేంద్రం నుంచి ఇంకా రావాల్సిన రూ.128 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన రూ.128 కోట్ల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డితో జరిగే సమావేశంలో రాజధానికి సంబంధించిన పలు అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సీఆర్డీఏ అధికారులు తెలిపారు.
Comments
Post a Comment