అనుష్క శెట్టికి గాయం.. ఇండస్ట్రీలో కొనసాగుతున్న బ్యాడ్ సెంటిమెంట్..
ఈ మధ్య ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో తెలియడం లేదు. రిస్క్ ఎక్కువగా చేసి అనవసరంగా గాయాల పాలవుతున్నారు మన హీరోలు. ఒక్కరో ఇద్దరో కాదు.. ఇండస్ట్రీలో కుర్ర హీరోలంతా ఈ మధ్య హాస్పిటల్ బెడ్ ఎక్కిన వాళ్లే. ఇప్పటికీ శర్వానంద్, నాగశౌర్య, సందీప్ కిషన్ లాంటి వాళ్లు వైద్యల పర్యవేక్షణలోనే ఉన్నారు. వీళ్లంతా రెస్ట్ మోడ్లో ఉన్నారిప్పుడు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ శాపం హీరోయిన్లకు కూడా వచ్చేస్తుంది. సైరా నరసింహారెడ్డి షూటింగ్ జరుగుతున్న సమయంలో అనుష్క గాయపడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ గాయం తగిలిన తర్వాత కూడా ఆమె ఎలాంటి హంగామా చేయకుండా ముందు షూటింగ్ పూర్తి చేసిందని తెలుస్తుంది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తుంది స్వీటీ. ఝాన్సీ అనే పవర్ ఫుల్ పాత్ర కోసం అనుష్కను తీసుకున్నాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. గతంలో చిరంజీవితో కలిసి స్టాలిన్ సినిమాలో నటించింది అనుష్క. అయితే అందులో ఓ స్పెషల్ సాంగ్ మాత్రమే చేసింది ఈ భామ. ఇప్పుడు కీలకమైన పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తి అయిపోయింది. దెబ్బ తగిలిన తర్వాత కాస్త చికిత్స తీసుకుని మళ్లీ షూటింగ్ పూర్తి చేసింది జేజమ్మ.
దాంతో దెబ్బ గురించి పెద్దగా వివరాలు కానీ.. విషయాలు కానీ బయటికి రాలేదు. ఇది జరిగి కూడా చాలా రోజులైందని తెలుస్తుంది. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ దెబ్బ తాలూకు నొప్పి అనుష్కను ఇబ్బంది పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈమె సైలెన్స్ సినిమాలో నటిస్తుంది. కోన వెంకట్ కథ అందిస్తున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు మధుకర్ తెరకెక్కిస్తున్నాడు. అమెరికా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాధవన్ హీరోగా నటిస్తుండగా.. హాలీవుడ్ నటుడు మైఖెల్ మ్యాడ్సన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
Comments
Post a Comment