ఆశావర్కర్ల జీతం రూ.10వేలకు పెంపు.. వెంటనే అమలు
సీఎం జగన్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. ఆశావర్కర్లకు శుభవార్త వినిపించారు. రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు జీతం రూ. 10 వేలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతేకాదు.. పెంచిన జీతం ఆగస్టు 1 నుంచే ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఉంది. గతంలో ఆశావర్కర్లకు జీతం రూ.3వేలు మాత్రమే. ఇన్సెంటివ్గా రూ. 5వేల 600 వరకు చెల్లించే అవకాశం ఉన్నా టీడీపీ ప్రభుత్వం అమలు చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి.
కేవలం రూ.3వేలే ఇన్సెంటివ్గా చెల్లించేలా సీలింగ్ విధించారని సమాచారం. దీని వల్ల గరిష్టంగా నెలకు రూ. 6వేలు మాత్రమే ఆశా వర్కర్లు పొందారు. పాదయాత్రలో వారి కష్టాలను స్వయంగా విన్న జగన్.. అధికారంలోకి వస్తే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.దీంతో తాజా నిర్ణయం తీసుకున్నారు.
జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల ఆశావర్కర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే తమకిచ్చిన హామీని నెరవేర్చడం పట్ల ఆనందం తెలిపారు. సీఎం జగన్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. మా కష్టాలను అర్థం చేసుకున్న జీతం పెంచినందుకు రుణపడి ఉంటామన్నారు. ఆశా వర్కర్లు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. జీతాలు పెంచాలని ఆశా వర్కర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. కొత్తగా వచ్చి జగన్ ప్రభుత్వం వారి కలను సాకారం చేసింది.
Comments
Post a Comment